లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

పరిశుద్దమైన దేవుడు

కీ.శే. యన్‌. దానియేలు గారు

యెషయా 6:5 ''నేను - అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివశించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని''

ఈ ప్రవక్త ఈ తరుణంలో ఇంకనూ తర్ఫీదులో ఉన్నాడు. ప్రవక్త అనగా దేవుని హస్తములలో ఒక కార్యసాధకుడు. దేవుని వాక్యమును మనుష్యులకు భావం చెప్పెడివాడు. యోచనలేని వాడు ప్రవక్త కానేరడు. అది ఒక ప్రవక్త అనే వానికి అపాయకరమైన విషయం. అనేకులు సువార్తను ప్రకటించవలెనని అంటారు. కాని దేవుని వాక్యమును తాకుటకు వారు పవిత్రపరచబడలేదు. ఈ ప్రవక్త దేవుని సన్నిధిలోనికి వచ్చియున్నాడు. ఆయన ప్రవేశించినది అతి పరిశుద్ధస్థలం. ఒక బాణం తగిలినట్టుగా అతడు కేక వేశాడు. దేవుని సన్నిధిలో నిలవలేకపోయాడు. అతడు మరణించలేదు గనుక నేను సంతోషిస్తాను. అలాంటి దేవుని సన్నిధిలో మనలో ఎవరైననూ సరే మరణించవచ్చును. మనం మారుమనస్సు పొందామని చెప్పుకోవచ్చు కాని ఇలాంటి దేవుని సన్నిధిలోనికి వచ్చినపుడు మనం క్రిందపడి మరణిస్తాము. అననీయ - సప్పీరలు ఇలాగే చనిపోయారు. దేవునిచేత పరిశుద్ధపరచబడిన సంఘంలో ఉన్నారని వారు ఎరుగకుండిరి. అక్కడ వారు వేషధారులుగా ఉండిరి.

24 సంవత్సరముల క్రితం ఒక యువకుడు మా మధ్య నివశించటానికి వచ్చాడు. అతడు మారు మనస్సు పొందినట్లుగా మాతో చెప్పాడు. నేను అతనితో చెప్పాను, '' జాగ్రత్త ఈ ఇల్లు దేవునికి చెందినది'', మన సంఘస్థుల జేబులు కొట్టడం ప్రారంభించాడు. మనుష్యులు వారి మధ్య దొంగ ఉండగలడు అని వారు ఎదురుచూడలేదు గనుక వారి దగ్గర నుండి డబ్బు దొంగిలించడం సులువు. నేను అతనిని హెచ్చరించాను. అకస్మాత్తుగా నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ అతని ఇంటిలో పక్షవాతం చేత కొట్టబడ్డాడు. అతడు 20 ఏండ్ల యవ్వనస్థుడు. దేవుని పిల్లల మధ్యకు మనం యోచనలేని వానిగా వెళ్ళకూడదు. ఈ ప్రవక్త అక్కడకు వచ్చేవరకు అతని ఆత్మీయజీవితం యొక్క కొరతను ఎరుగడు. అనేకమంది మన దగ్గరకు వచ్చి మారుమనస్సు పొందామని చెప్పుకుంటారు. వారు దీనులును, యదార్థవంతులును అయితే వారు యెషయా వలే మొరపెడతారు. అనేకమంది ఇలాగు మొరపెట్టారు, వారు దేవుని దగ్గర నుండి కనికరం పొందారు. యెషయా చెప్పాడు. ''అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను'' అతడు మరణించబోతున్నానని తలంచి ఈవిధంగా కేక వేశాడు. మన శరీరము పరలోకమునకు తగనిది. మనం పరలోకములోనికి ఈ శరీరంతో ప్రవేశించలేము. ఏలియా దారిలో మార్చబడి పరలోకంలో ప్రవేశించాడు. యేసు ఒక్కడే పరలోకంలో ఉండటానికి, భూలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండటానికి తగినవాడు. ఆయన యందు పాపం లేదు. ఆయన తలంపులలోనూ, ఊహలలోను సైతము పాపం లేనివాడిగా జీవించాడు. ఆయనతో నడిచినవారు ఆయనను పూర్తిగా గ్రహించలేదు. యూదా ఆయనకు తక్కువ విలువ ఇచ్చాడు. ఆయనను వెంబడిస్తూ నశించిపోయాడు. పరిశుద్ధులతో కలిసి ఉండవలెనని ఆశించిన వారిని అనేకమందిని నేనెరుగుదును. వారు అట్లే నశించిపోయారు. వారితో స్వేచ్ఛగా కలిసిఉండడం అపాయకరమైన విషయము. వారితో కలిసి ఉండడం, భోజనం చేయడం సులువైన విషయాలు. దేవుని పరిశుద్ధత గురించి జాగ్రత్త. కొన్ని తీగలలో చాలా తీక్షణమైన విద్యుచ్ఛక్తి గల కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. మీరు వెళ్ళి వాటిని ముట్టుకోకూడదు జాగ్రత్త. వాటి సమీపమునకు వెళ్ళినా కూడా అపాయకరమే. నీవు చనిపోతావు. ఆ తీగలో తీక్షణమైన విద్యుత్‌శక్తి ప్రవహిస్తూ ఉండును. దేవుని పిల్లలతో చులకనగా ప్రవర్తించేటప్పుడు జాగ్రత్త. దేవుని చూడవలెననుకొంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సుందర్‌సింగ్‌గారు క్రీస్తును చూచినప్పుడు ఆయన చెప్పాడు. ''ఇది చాలు ఈ దృశ్యంను ఇంతకన్నా చూడలేను'' కొంతమంది స్పృహ తప్పి పడిపోతారు. ఇక్కడ దేవుని చేత పరీక్షించబడిన ప్రవక్త ఒకడు ఉన్నాడు. అతడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాడు. దూతలు అక్కడ ఉండినారు. కాని వారు సహితము వారి ముఖములు కప్పుకున్నారు. భవనం అంతా కంపించింది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని మనం ఎరగాలి. ఆయన లోకం లోనికి వచ్చినప్పుడు ఆయన ఎలాగు తన్నుతాను మితపర్చుకున్నాడు ! ఆయన తల్లి పరిశుద్ధురాలు లేకపోయినట్లయితే చనిపోయి ఉండేది. వారి గృహం పరిశుద్ధ పరచబడింది. ఆయన తండ్రిగారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. దేవదూతలు ఆయన గృహం సులువుగా దర్శించేవారు. యెషయా దేవున్ని, ఆయన సమస్త మహిమలు చూచాడు. ఒక రోజున మనం కూడా పరిశుద్ధ పరచబడిన వారమైతే నాశనం పొందకుండా మనం కూడా ఆయనను అలా చూస్తాం. అలాంటి పరిస్థితిలో మనం ఇంకనూ ఎక్కువ సజీవులమగునట్లు మనం ఇంకనూ ఎక్కువ సజీవులమగునట్లు చేస్తుంది. ఆయన పరలోక మహిమను చూచి తెలిసిన వారమగునట్లు చేస్తుంది. అప్పుడు మనం ''అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను'' అని చెప్పము. మనం ''నేను సంతోషించుచున్నాను. గొర్రెపిల్ల రక్తము నన్ను శుద్ధీకరించినది. నేను ఈ స్థలంలో ఉండటానికి తగినట్లుగా చేయబడ్డాను'' అని అనుకుంటాము. దూతలు ''గొర్రెపిల్లకు మహిమ'' అని పాడుదురు దేవుని బిడ్డలందరికి క్రీస్తు రక్తంలో విశ్వాసముంచుట ఇవ్వబడిన ప్రత్యేక అధికారం. మనం చూసేది మనం తేటగా గ్రహించగలుగుతాం. ఇప్పుడు మనమొక బిడ్డరీతిగా గ్రహిస్తున్నాం. ఒక చిన్న బిడ్డకు ఇవ్వబడిన గ్రహింపు బహు స్వల్పమైనది. నేను కున్నూరులో ఉండినప్పుడు సూర్యుడు సముద్రం వెనుక భాగంన అస్తమించడం చూచాను. నా చిన్నకుమారుడు సూర్యుడు సముద్రంలో మునిగిపోతున్నాడే అని చాలా భయపడ్డాడు. నేను వానికి ఖగోళశాస్త్ర సంబంధమైన దూరాలనుగాని, భూగోళ సిద్దాంతాలను మరియు భూపరిభ్రమణ సిద్ధాంతం గాని నేను వానికి గ్రహింపు చేయలేకపోయాను. కనుక నేను వానికి సూర్యుడు స్నానం ఆచరించటానికి క్రిందికి వెళ్ళాడని మరలా మరుసటి ఉదయం తిరిగి లేస్తాడని వానికి చెప్పాను. ఆ జవాబుతో నాకుమారుడు తృప్తి చెందాడు. ఈ అసాధారణమైన అద్భుతమును ఒక చిన్నబిడ్డకు నేను వివరించేదెట్లు? మనం కూడా చిన్నపిల్లలవలే ఉన్నాము. పరలోకంలో ఉన్నవారు మనలను కడిగే రక్తమును గూర్చి, గ్రంథమును తెరుచుటకు యోగ్యుడైన గొర్రెపిల్లను గూర్చి పాడుచూ ఉందురు. పెద్దలు తమ సింహాసనం నుండి క్రిందకు పడి గొర్రెపిల్లను ఆరాధింతురు. మనం కూడా క్రిందబడి ఆరాధించవలసివారమైయున్నాము. ఒక దినాన్న ఈ రాజును ఆయన సింహాసనం మీద చూస్తాము. ఆయన నిన్ను గూర్చి ''ఈ మనుష్యుడు పవిత్రపరచబడి యున్నాడు. గనుక దేవుని వాక్యం ప్రకటించబడుటకు యోగ్యుడు'' అని చెప్పబడవలసి ఉంది. మనం పరిశుద్ధపరచబడాలి. ఆ నిస్సహాయమైన కేక మన దగ్గర నుంచి రావాలి, ''అయ్యో, నేను అపరిశుద్ధుడను నేను పరిశుద్ధ పరచబడకుండా ఉండలేను'' యెషయా మారు మనస్సు పొందినవాడు, అతడు దేవుని దగ్గర కనిపెట్టాడు. మనం దేవుని దగ్గర కనిపెట్టేవారమైతే యాత్రికుల వలే ముందుకు ప్రయాణం చేస్తాము. వారు ఒకప్పుడు మీలాగా నడిచి తమ మార్గమును సంపూర్ణము చేశారు. వారు పరలోకపు దిశను ప్రయాణం చేశారు. దూతలు వారిని పరలోకంలోనికి ఆహ్వానించారు. అతడు 'నేను నశించితిని' అని కేక వేసినప్పుడు దూతలు వచ్చి వాని పెదవులు ముట్టుకున్నారు. నీవు మారుమనస్సు పొంది ఉండవచ్చును గాని ఇది ఇంకా లోతైన అనుభవం.

దేవుడు ఈ రీతిగా మోషే, దానియేలుతో చేసాడు. ఆయన మనకు అదే కార్యము చేయవలెనని కోరుతున్నాడు. మనము బోధించేటప్పుడు ప్రతిసారి ప్రభువు యొక్క ప్రత్యేకమైన తాకుడు అవసరము. నీవు బోధించేటప్పుడు పరలోకపు తలంపులను భూ సంబంధమైన సుగంధ ద్రవ్యములతో కలపకూడదు. దాని కొరకు నీ పెదవులు ముట్టబడియుండాలి. అనేకమంది పాస్టర్లు మాకు సహాయం చేయడానికి వచ్చారు. వారి మాటలలో సగం మంచివిగానే యుండినవి. కాని వారి సలహాలు భూ సంబంధమైనవి. వారి సలహాను నేను పాటించి ఉంటే ఈ సహవాసము ఉండేది కాదు. దేవుడు నాతో చెప్పాడు, ''నిన్ను పిలిచిన వాడను నేనే, నేనే నిన్ను నడిపించెదను''.

వెల్లింగ్‌టన్‌ అనే స్థలంలో నేను ప్రార్థిస్తూ సంఘముల కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాను. ఒక పాస్టరుగారు నాకు వ్రాసాడు, ''అయ్యా మీరు సంఘములతో ఏకీభవించండి - సంఘములతో ఒక లైనులో నడవండి అది అతి శ్రేష్టమైన పద్ధతి''. ఎంత యోచనలేని, లోతులేని సలహా ఇది! నేను వారికి తిరిగి వ్రాశాను, ''మీరు దేవుని ఆత్మచేత నడిపించబడి మాకీవిధంగా వ్రాశారా? మనకు వ్యతిరేకంగా భయంకరమైన శక్తులు పనిచేస్తున్నవి, సంఘముల కొరకు కన్నీరు కార్చేవారు ఉన్నారా? తమ సంఘముల కొరకు కన్నీరు కార్చే పాదిరులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మిషనరీలు వారి సంఘముల కొరకు కన్నీరు కారుస్తారు? యోచనలేని మాటలు మాటలాడటం సులువు. ప్రార్థనలో ప్రసవ వేదన పడటం కష్టం.

పేతురు యొక్క పెదవులు పరిశుద్ధమైన అగ్నిచేత ముట్టబడి పరిశుద్ధ పరచబడినవి. అతడు క్రీస్తును రాబోవుచున్న మెస్సీయాగా గ్రహించాడు. ఇది మానవుని యొక్క తెలివితేటల వలన, జ్ఞానం వలన సాధ్యమైనది కాదు. అది దేవుని యొక్క పరిశుద్ధమైన యోచన. క్రీస్తు, ''నాతండ్రి మీకు బయలు పరిచాడు. పరలోకపు గవునుల తాళపు చెవులు పట్టుకొని యుండుటకు అర్హత నొందినవాడవు. దేవుడు తన్ను తాను నీకు బయలుపరచుకొనుట నీకు తెలియపర్చాడు''. కాని క్రీస్తు తన మరణంను గూర్చి పేతురుతో చెప్పగా అతడు వృద్ధుడైన ఒక మనుష్యుడు క్రీస్తు యెడల ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించాడు. పేతురు నిజంగా వయస్సులో పెద్దవాడే లోకరీతిగా కాని అతని సలహా తప్పు. పేతురు ఒక గద్దింపును తీసుకున్నాడు. సైతాను పేతురుకు ప్రోత్సాహం ఇచ్చాడు. దేవుని దగ్గర నుండి సిలువను గూర్చిన ప్రకటన ఏదీ అతడు గ్రహించలేదు. ఆ సలహాలో క్రీస్తు సైతానును చూచాడు. మనం అలాగే ఉన్నాము. మన ఉద్దేశాలన్నీ సరిగా ఉన్నాయని అనుకుంటాం. మన తాతలు కూడా మనకు కొన్ని కథలు చెప్పారు. మనం వాటిని నమ్మాం. ఆ జ్ఞానంనకు ప్రతిగా దేవుని శక్తిని అంచనా వేస్తుంటాం. దేవుని గూర్చిన జ్ఞానం కొంచెం ఉన్నది మనకు. దేవుడు దానిని హెచ్చించవలెనని కోరుతున్నాడు. చిట్టచివరిగా ఆయన మనస్సును గ్రహిస్తాం. దేవునివి కానటువంటి తలంపులను తొలగిస్తాం. అప్పటివరకు మనం అపాయంలో ఉన్నాం. అనేకులు బైబిలు ఎరుగనివారు వారు దానిని జాగ్రత్తగా చదవరు. వారు తమ హృదయంను కూడా ఎరుగరు. హృదయంలోని భాగములలో సరిగా తెలియని భాగముల నుండి దేవునికి సంబంధించని తలంపులు ఉద్భవిస్తాయి. నీ హృదయం చాలా లోతైనది. నీ పూర్వీకులు యొక్క మనస్సులో నుండిన అనేక తలంపులు నీ హృదయం నుండి బయలుదేరుతాయి. యెషయా అన్నాడు ''నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య జీవించుచున్నాను''.

10 వ వచనం : ''వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించు''మని చెప్పెను. వారు దేవుని వాక్యం గ్రహించరు. ఒక పొర తర్వాత మరియొక పొర మన హృదయంను మనం శుద్ధీకరించాలి. దాని లోతులలో ఏమున్నదో మనం ఎరుగము. మనం తప్పుడు ఉద్దేశ్యంలను మన చుట్టూ ఉండే ఇతర మతముల నుండి, మరియు మనము పారంపర్యముగా మన సంఘముల నుండి తప్పుడు ఉద్దేశ్యములను తీసుకొని యుంటాము. పాపము లూథరు గారు కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది. ఆయన శ్రమల గురించి చదివేటప్పుడు మీరు ఏడవకుండా ఉండలేరు. ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని క్రూరమైన కార్యములు ప్రయత్నించారు! పాదిరులు మొట్టమొదట శుద్ధీకరించబడాలి. వ్యభిచారము, పాదిరుల మధ్య కూడా కనబడుచున్నది. ఇలాంటి పరిస్థితులలో మన బిడ్డలు ఏలాగు మంచివారుగా ఉండగలరు? పరిశుద్ధ వివాహములు ఎలాగు ఉంటాయి? ''ఈ స్థలం యెహోవా ఆలయము'' అని చెప్పుటలో అర్థమేమి?యిర్మియా 7:4 ''ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి''. నీవు బంగారం అనుకొనేది హీనమైన లోహముగాను, నిరుపయోగముగా ఉండచ్చును. వెస్లీ దీనిని కనుగొన్నారు. పాస్టర్లు త్రాగుచూ, పాపంలో జీవిస్తూ సువార్త ప్రకటించకూడదని వెస్లీ చెప్పారు. అనేకమంది పరిశుద్ధులైనటువంటి స్త్రీ పురుషులు లేచి ఆయన చుట్టూ చేరి ఇంగ్లాండును రక్షించారు. నిజముగా మారుమనస్సు పొందిన ప్రజలు అనేక జనములను క్రీస్తు దగ్గరకు నడిపించగలరు. నేర్పుతో మారుమనస్సు పొందిన వారిని తయారుచేసి బాప్తిస్మంలు ఇచ్చుట ద్వారా దేవుని సేవ కట్టబడటానికి వీలులేదు. ఈ విధంగా మనం ఆత్మలను నాశనం చేయవచ్చు.

ఒక వైద్యవిద్యార్థి ఫెలోషిప్‌కు రావడం మానివేశాడు. ఎవరో ఆయన గూర్చి ఇతడు మార్చబడలేదు అని చెప్పారు. తదుపరి ఒక అమ్మాయితో పారిపోయాడు. మనం ఇలాంటి జీవితాన్ని జీవించినప్పుడు క్రీస్తు రక్షించగలడు అని ఇతరులకు చెప్పగలమా? వారు మనలను వేషధారులు అని పిలుస్తారు. మీరు వెళ్ళి మీ సంఘంలో హెచ్చరించండి అని చెప్పుతారు. మీ అందరికి యెషయాకు కలిగిన అనుభవం కలుగవలెనని ఆశిస్తున్నాను. నడినెత్తి నుండి అరికాలు వరకు పాపం ఉన్నదని అనే భావం. ప్రవక్త యొక్క ఏడ్పువంటి ఏడ్పును ఎవరు మీచేత చేయించగలరు. యెషయా పెట్టిన మొర్ర వంటి మొర్ర ప్రతి క్రైస్తవుడు పెట్టవలెను. నీవు పౌలుతో కలిసి ''నేను పాపులలో ప్రధాన పాపిని అని చెప్పగలవా?''

మనం బోధించేది ఎలాగో మనం జాగ్రత్తగా చూచుకుందాం నీ వర్తమానంలో ఒక వాక్యం దేవుని దగ్గర నుంచి, తక్కిన వాక్యములన్నీ దయ్యం దగ్గర నుండి ఉండవచ్చు. నేను ఒక సువార్తికుడను కలుసుకున్నాను. అతడు పేరాశ కలవాడు. నేను అతనిని దిద్దినపడు ''ఒక దేవుని బిడ్డ పాపం చేయలేడు'' అన్నాడు. నీ తలంపును గూర్చి జాగ్రత్త? చలింపని ఉద్దేశ్యముల విషయము జాగ్రత్త తీసుకోండి. ''నా సంఘం మంచిది, అది ఏమి చేసినా సరే'' అని అనకండి. మీ సంఘములకు వెళ్ళండి. కాని దాని కొరకు ఏడ్చి కన్నీరు కార్చండి. నేను నా సంఘమునకు అలా చేసాను. మా పాస్టరుగారి కొరకు ఏడ్చాను. ఒక ప్రవక్త యొక్క అనుభవం కొరకు వెదకండి. సంఘం కొరకు ఏడ్చేది నీపని. జనవరి 1935లో ఒక సహోదరుడు వచ్చి దేవుని సేవ కొరకు ఒక ఆలయంను కట్టవలెనని ఆశిస్తున్నాను అని అన్నాడు. నేను అతని కొరకు ప్రార్థన చేసి ప్రభువు యొక్క నడిపింపును వెదికాను. ఏప్రియల్‌ మాసంలో ప్రభువు నాకు బయలు పరిచిన విషయం - ఆయన మందిరం మద్రాసులో కట్టమని చెప్పాడు. తదుపరి విశ్వాసపు మెట్టులో దానిని నడిపించమన్నారు. జూలై 15వ తేదీన పని ప్రారంభం చేయబడును అని దేవుడు చెప్పారు. కాని నా విశ్వాసం చాలనట్లుగా నేను చూశాను. అంటే దేవుడు నిన్ను పిలిస్తే ఆయనసేవ చేయడానికి నీకు విశ్వాసం ఉందని అర్థం కాదు. నా కుటుంబం, జాగ్రత్తగా చూసుకోవడం విశ్వాస మార్గంలో నడిచివెళ్ళడం నాకు నూతన సాహస కార్యం. నా విశ్వాసం నిలబడుతుందా, పడిపోతుందా? నా విశ్వాసం నిలబడుతుంది అని నిశ్చయించుకోవడానికి నా భార్య నేను జమాయమ్మ గారితో కలిసి ఒంటరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఒక నెల తీసుకున్నాము. ఖర్చులు భరించటానికి నేను నా డబ్బు తీసుకువెళ్ళాను. కాని నేను దేవుని ఎదుట పెట్టినటువంటి షరతు ఏమిటంటే నేను ఖర్చుపెట్టిన డబ్బంతయు దేవుడు మేము ఆ స్థలం విడిచిపెట్టకముందు తిరిగి మాకు ఇవ్వాలి. ఇది మేము ఎవరికినీ చెప్పలేదు. మేము ఒక నెల దినములు కొడైకెనాల్‌లో మా ఎదుట ఉంచబడిన విషయముల గూర్చి ప్రార్థిస్తూ ఉన్నాము. చివరి క్షణంలో డబ్బు తిరిగివస్తుంది అని దేవుడు తనతో చెప్పినట్టు జమాయమ్మగారు చెప్పినారు. ఇతరులు మాకు డబ్బులు ఇవ్వవలెనని ఎవరినీ అడగలేదు. చివరి దినమున సమస్తము కట్టుకొని ఇంటికి తాళం వేసి అక్కడ ఉండిన ఒక చక్కని చాపెల్‌లో ప్రార్థన చేయడానికి వెళ్ళాము. ఆ పట్టణం విడిచిపెట్టే ముందు చివరిసారి ప్రార్థన చేసాం. అప్పుడు డబ్బు వచ్చింది. గత 27 సం||లుగా దేవుడు నమ్మకస్థుడై ఉండినాడు. ఈ ఫెలోషిప్‌ చరిత్రను ఎరుగుదురు. ప్రార్థన ద్వారా దేవుడు దానిని సాధ్యపరిచాడు. ఆయన దానికి ఆధారమైయుండి దానిని నడిపిస్తుంటాడు. ఒక నీతి గల జనము వలె మనం ముందుకు సాగుదాము.

మూల ప్రసంగాలు